న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ ప్రపంచదేశాలతో పాటు భారత్ను వణికిస్తున్నది. దేశంలో థర్డ్ వేవ్కు ఈ వేరియంటే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనం శుభవార్త చెప్పింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పేషెంట్లో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు డెల్టా వేరియంట్ సహా ఇతర అన్ని హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుందని తెలిపింది.
ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అవుతుందని అధ్యయనం పేర్కొంది. ఒమిక్రాన్ కారణంగా రోగిలో ఉత్పత్తి అయ్యే ఇమ్యూన్ రెస్పాన్స్ డెల్టా వేరియంట్ను ఎదుర్కొంటాయని, దీంతో రీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని తెలిపింది. తద్వారా డామినెంట్ వేరియంట్గా డెల్టా వేరియంట్ ఎంతో కాలం ఉండబోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇదే సమయంలో వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ విధానాల్లోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది.
ఒమిక్రాన్ లక్ష్యంగా చేసుకుని టీకా వ్యూహాన్ని రూపొందించాలని సూచనలు చేసింది. 39 మంది వ్యక్తులపై ఐసీఎంఆర్ అధ్యయనం నిర్వహించింది. వీరిలో 25 మంది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండు మోతాదుల టీకా తీసుకోగా.. ఎనిమిది మంది ఫైజర్ టీకాలు తీసుకోగా.. ఆరుగురు ఇప్పటి వరకు ఇంకా టీకాలు వేసుకోలేదు. 39 మందిలో 28 మంది యూఏఈ, దక్షిణ, పశ్చిమ, తూర్పు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, అమెరికా, యూకే నుంచి తిరిగి వచ్చిన వారు కాగా.. 11 మంది వారి హై రిస్క్ కాంటాక్టులు.. వీరందరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది.
ఈ సందర్భంగా ఆయా వ్యక్తుల్లో యాంటీబాడీల ప్రతిస్పందనపై ఐసీఎంఆర్ అధ్యయనం మదింపు చేయగా.. ‘ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో గణనీయమైన ఇమ్యూన్ రెస్పాన్స్ మా అధ్యయనం గుర్తించింది’ ఐసీఎంఆర్ తెలిపింది. ప్రగ్యా డీ యాదవ్, గజానన్ ఎన్ సప్కల్, రిమా ఆర్ సహాయ్, ప్రియా అబ్రహంతో సహా ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనాన్ని ఇంకా రివ్యూ చేయాల్సి ఉండగా.. బుధవారం బయోఆర్క్సివ్ (bioRxiv) ప్రీప్రింట్ సర్వర్లో విడుదల చేశారు.