బెంగళూరు: కర్ణాటకలో సీఎం పదవి కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య గట్టిపోటీ నెలకొన్నది. ఇద్దరిలో ఏ ఒక్కరూ పట్టు సడలించకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం డీకే శివకుమార్ తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. తాను ఒంటరినని, రాష్ట్రంలో ఒంటరిగానే పార్టీని గెలిపించుకున్నానని ఆయన చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో శ్రమించానని అన్నారు.
తన నేతృత్వంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 135 అసెంబ్లీ స్థానాలు దక్కాయని డీకే చెప్పారు. సీఎం పదవి విషయంలో పార్టీ హైకమాండ్దే తుది నిర్ణయమని, అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సరైన నిర్ణయమే తీసుకుంటుందని భావిస్తున్నానని డీకే శివకుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు. తాను ఒంటరిగానే పోరాటం చేస్తానని, గతంలో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ధైర్యం కోల్పోకుండా తిరిగి పార్టీని బలోపేతం చేశానని చెప్పారు.
అదేవిధంగా మాజీ సీఎం సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇటీవల తన బర్త్ డే వేడుకల్లో కూడా సిద్దరామయ్య పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రంలో తనకంటూ ఉన్న మద్దతుదారుల సంఖ్యను తాను చెప్పనని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తాను తన గురువును కలిసిన తర్వాతనే ఢిల్లీకి వెళ్తానన్నారు. అయితే తన గురువు ఎవరో ఆయన వెల్లడించలేదు.