ఇంఫాల్: అల్లర్లు, హింసతో రగులుతున్న మణిపూర్ (Manipur)లో భద్రతా దళాలు మరో పురోగతి సాధించాయి. భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మణిపూర్లోని చురచంద్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆందోళనకారులు ఒక చోట భారీగా ఆయుధాలు దాచి ఉంచినట్టు నిఘా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆర్మీ, అస్సాం రైఫిల్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మణిపూర్ పోలీసులు కలిసి రంగంలోకి దిగారు. ఆదివారం పక్కా ప్రణాళికతో ఉమ్మడిగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 15 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 14 మోర్టార్లు, సింగిల్ బారెల్ తుపాకీ, మందుగుండు సామాగ్రి వంటివి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఈ నెల 15న కూడా తౌబల్ ప్రాంతంలో భారీగా ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అస్సాం రైఫిల్స్, తౌబల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. క్వారోక్ మారింగ్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. పలు ఆయుధాలతోపాటు 9 ఎంఎం కార్బైన్ వెపన్స్ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు వాటిని అప్పగించారు.