న్యూఢిల్లీ : గత రెండేళ్లుగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతున్నది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ భారత్లో థర్డ్ వేవ్ కారణమవుతోంది. గతేడాది మే, జూన్లో డెల్టా వేరియంట్తో సెకండ్ వేవ్లో జనం తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని నిపుణులు అధ్యయనాల్లో గుర్తించారు. వైరస్ వేగంగా సోకుతున్నా చాలా మందిలో తేలికపాటి, మితమైన లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ల మధ్య స్వభావం భిన్నంగా ఉందని, సెకండ్ వేవ్తో పోలిస్తే థర్డ్ వేవ్లో విభిన్న లక్షణాలు కనిపించడానికి కారణం ఇదేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. కొత్త వేరియంట్ సోకిన సమయంలో.. కొందరు రోగులు డెల్టా వేరియంట్ మాదిరిగానే లక్షణాలుంటున్నాయని.. మరికొందరు రోగుల్లో పూర్తి భిన్నమైన లక్షణాలను గుర్తించారు. డెల్టా సోకిన వారిలో రుచి, వాసన లేకపోవడమే ప్రధాన లక్షణాలుగా గుర్తించగా.. ఈ సారి ఎక్కువ మందిలో ఈ లక్షణాలు కనిపించడం లేదు. థర్డ్ వేవ్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సీనియర్ రెస్పిరేటరి స్పెషల్ డాక్టర్ సౌరభ్ అవస్తీ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. వైరస్ రెండు విభిన్న వైవిధ్యాల కారణంగా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చిందని, దీని స్వభావం ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. ఈ సారి వైరస్ సోకిన వారిలో కొన్ని భిన్నమైన లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. డెల్టా కంటే వేగంగా సోకుతుంది. డెల్టా ప్రధానంగా ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుంటే.. ఒమిక్రాన్ గొంతును లక్ష్యంగా చేసుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సందర్భంలో లక్షణాలు సహజంగా భిన్నంగా ఉంటాయి.
సెకండ్ వేవ్లో డెల్టా వేరింట్ సహజంగానే తీవ్రమైన లక్షణాలు, సమస్యలను కలిగించినట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే జనం ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ సమయంలో వైరస్ సోకిన వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, ముక్కు కారటం, గొంతు నొప్పి, దగ్గు, రుచి, వాసన కోల్పోవడం వంటి సమస్యలతో బాధపడ్డారు.
దేశంలో మూడో తరంగానికి ఓమిక్రాన్ వేరియంట్ కారణమని భావిస్తున్నారు. ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే తీవ్రమైన అంటువ్యాధి. అయితే, తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగించడం లేదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇన్ఫెక్షన్ సోకిన సమయంలో రోగ నిరోధక శక్తి చాలా బలహీనంగా ఉన్న లేదంటే.. ఇప్పటికే కొమొర్బిడిటీలకు గురైన వ్యక్తుల్లో మాత్రమే తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ సోకిన తర్వాత పలు లక్షణాలను గుర్తించారు. ఈ సారి జనం జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు, ముక్కు కారటం, గొంతు నొప్పి, అధిక చెమట తదితర సమస్యలను ఎదుర్కొన్నారు. మరికొందరు రుచి, వాసనను గుర్తించకపోవడం వంటి సమస్యలనుఎదుర్కొన్నారు.
ఒమిక్రాన్ ఉధృతి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య నిపుణులు ప్రజలంతా నివారణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, కొత్త వేరియంట్ సోకిన వ్యక్తుల్లో పలువురికి చర్మంపై దద్దుర్లు, దురదలతో పాటు డెలిరియమ్ వంటి మానసిక సమస్యలకు గురవుతున్నారని నిపుణులు హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకరమైంది ఏమీ కాకపోయినప్పటికీ.. సెకండ్ వేవ్లో తీసుకున్న జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్తో మరణాలు సంభవించినట్లు తెరపైకి వస్తుండగా.. వేరియంట్ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.