భోపాల్: ఎన్నికల తర్వాత అందరి లెక్కలు సరిచేస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆ రాష్ట్ర పోలీసులను హెచ్చరించారు. బహిరంగ ర్యాలీలో మాట్లాడిన ఆయన మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని గుర్తు చేశారు. ‘ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దూకుడు, భయాందోళనలకు గురికావద్దని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. పోలీసు అధికారులంతా చెవులు విప్పి వినాలి. రాబోయే ఎన్నికల్లో అందరి ఖాతాలు సరిచేస్తాం’ అని కమల్నాథ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షాన పోలీసులు, అధికార యంత్రాంగం వ్యవహరిస్తుండంపై ఆయన ఈ మేరకు హెచ్చరించారు.
కాగా, కమల్నాథ్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ మండిపడింది. బెదిరింపు, ప్రతీకారం, ప్రతీకార రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని తెలియజేస్తున్నదని బీజేపీ నేత షెహజాద్ పూనావల్ల విమర్శించారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఆ పార్టీ రాష్ట్రంలో పొరపాటున అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా లేక ఖండిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.