ఇంఫాల్: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ నాయకత్వం విడుదల చేసింది. జాబితాపై పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. అభ్యర్థుల పట్ల అసమ్మతి మొదలైంది. తమను కాదని ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి ఎలా టికెట్ కేటాయిస్తారంటూ పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలకు నిరసన సెగలు తగిలాయి. ఇంఫాల్లోని బీజేపీ కార్యాలయం వద్ద టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఆందోళనకు దిగారు.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈసారి నలుగురు అంతర్జాతీయ ఆటగాళ్లకు కూడా బీజేపీ టికెట్లు కేటాయించింది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ హింగాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మణిపూర్లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడతాయి.
అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వెంటనే మణిపూర్లో పలు చోట్ల బీజేపీ కార్యకర్తల నిరసనలు మొదలయ్యాయి. పలువురు సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. దాంతో ఆగ్రహించిన మద్దతుదారులు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం బీరెన్ల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ అభ్యర్థుల జాబితాపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు నేతలు.. ఆ పార్టీకి రాజీనామా కూడా చేసినట్లు సమాచారం.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానిక పార్టీలు-నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) తో చేతులు కలిపిన బీజేపీ మణిపూర్లో అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ కేవలం 21 సీట్లు గెలుచుకున్నది.