షిమ్లా: హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కమ్లేష్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు. తన భర్తకు మద్దతుగా నిలిచినందుకు రాష్ట్ర ప్రజలందరికి ధన్యవాదాలు అని చెప్పారు. అంతేగాక అందరం కలిసి ఆయనకు మద్దతు ఇలాగే కొనసాగిద్దామని కమ్లేశ్ పిలుపునిచ్చారు.
ఆమె భర్త హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించడానికి కొన్ని గంటల ముందు కమ్లేశ్ ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. దాంతో శనివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.
ఈ క్రమంలో ఇవాళ సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణం స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.