ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శనివారం నోటీసులు జారీ చేసింది. ముంబయిలోని ఖార్ ప్రాంతంలో ఫ్లాట్లో అక్రమ కట్టడాలను నిర్మించారని, అనధికారిక నిర్మాణాలను ఏడు రోజుల్లో తొలగించాలంటూ నోటీసులు ఇచ్చింది. అనుమతి లేని నిర్మాణాలను ఏడు రోజుల్లో కూల్చివేయకపోతే చర్యలుంటాయని హెచ్చరించింది. నిర్మాణాలను తొలగించడంతో పాటు ఫ్లాట్ యజమానికి నెల రోజుల జైలు శిక్ష కూడా విధించవచ్చని బీఎంసీ పేర్కొంది.
గతంలోనూ నవనీత్ రాణా దంపతులకు బీఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలను నోటీసుల్లో పేర్కొంది. అయితే, గత నెలలో హనుమాన్ చాలీసా వివాదంతో నవనీత్ రాణా దంపతులు వార్తల్లో నిలిచారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ ఎదుట హన్మాన్ చాలీసా పటిస్తామని ప్రకటించగా.. ఆ తర్వాత రాణా దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. దేశద్రోహం కేసుతో పాటు పాటు పలు అభియోగాలను నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ నెల మొదటి వారంలో జైలు నుంచి విడుదలయ్యారు.