H3N2 | ఇన్ఫ్లుయెంజా వైరస్ సబ్టైప్ H3N2 దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ప్రాణాంతకమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా తప్పనిసరిగా నివారణ చర్యలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ గరిష్ట ప్రభావం పిల్లల్లో కనిపిస్తోందని ఇటీవల పలు నివేదికలు పేర్కొన్నాయి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగే ఆసుపత్రిలో చేరే ప్రమాదం పెంచుతుందని నివేదికలు హెచ్చరించాయి. H3N2తో పాటు, పలు రాష్ట్రాల్లో H1N1 కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ముప్పునకు అడ్డుకట్ట వేసేందుకు నిపుణులు పలు సూచనలు చేశారు.
H3N2 సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజాతో వచ్చే వ్యాధులు మార్చి నెలాఖరు వరకు తగ్గుముఖం పడుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, అప్పటి వరకు వైరస్ను నివారించేందుకు అందరూ తప్పనిసరిగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు కూడా నమోదవుతున్నాయి. వీటిలో చాలా లక్షణాలు H3N2 మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. కొవిడ్తో పాటు H3N2 లక్షణాలపై తేడాపై శ్రద్ధ చూపాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్ విశిష్ట్ మాట్లాడుతూ శ్వాసకోశ వ్యాధుల ప్రభావం ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుందన్నారు. వైరస్ సోకిన పిల్లలలో అధిక జ్వరంతో పాటు ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కనిపిస్తాయని చెప్పారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా తీవ్రమైన లక్షణాలను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఐసీయూలో చేరాల్సి వస్తుందన్నారు. ఇన్ఫ్లుయెంజా సబ్ వేరియంట్ తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని, పిల్లలకు, వృద్ధులతో పాటు కోమోర్బిడిటీతో బాధపడే వారికి ప్రత్యేక రక్షణ అవసరమన్నారు.
ఇన్ఫ్లూయెంజా కేసులు చాలా వరకు సాధారణ మందులు, తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు వాడాలని డాక్టర్ అరవింద్ సూచించారు. H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్కు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్ పని చేయనప్పటికీ, చాలా మంది దుకాణాల్లో యాంటీబయాటిక్స్ కొనుగోలు చేసి తీసుకుంటున్నారన్నారు. పిల్లలకు సొంత వైద్యం చేయొద్దని తల్లిదండ్రులకు సూచించారు. లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి.. సూచించిన మందులను మాత్రమే వాడాలని చెప్పారు. వైరస్ నివారణకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోటిని భాగాన్ని కప్పి ఉంచాలి. క్రమం తప్పకుండా సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఫేస్ మాస్క్ ధరించాలి. రద్దీగా ఉండే ప్రమాదాలకు దూరంగా ఉండాలి. చేతితో ముక్కు, నోటి భాగాలను తాకొద్దు. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకునేందుకు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. జ్వరం, వొంటి నొప్పులు ఉంటే పారాసిటమాల్ తీసుకోవాలని ఆయన సూచించారు.