లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ మఠమైన గొరఖ్పూర్లోని గొరఖ్నాథ్ ఆలయంపై దాడికి పాల్పడిన నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలున్నాయని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఐఎస్ఐఎస్ తరుఫున పని చేసేందుకు 2020లో అతడు ప్రతిజ్ఞ చేశాడని యూపీ లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఆ ఉగ్రవాద సంస్థకు మద్దతివ్వడంతోపాటు ఆర్థిక సహాకారాన్ని కూడా అందిస్తున్నాడని మీడియాకు శనివారం వెల్లడించారు. గొరఖ్నాథ్ ఆలయంపై దాడి అనంతరం నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీని రాష్ట్ర ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ ప్రశ్నించిందని చెప్పారు. అతడి వద్ద ఉన్న అనేక ఈ-డివైజ్లు, జీమెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాలు, ఈ వ్యాలెట్ ద్వారా జరిపిన లావాదేవీల డేటాను విశ్లేషించిన తర్వాత ఐఎస్ఐఎస్తో ఉన్న సంబంధాల గురించి బయటపడిందన్నారు.
అబ్బాసీకి ఐఎస్ఎస్ ఫైటర్లు, సానుభూతిపరులతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఉందని ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తీవ్రవాద సంస్థల రాడికల్ బోధకులు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద ప్రమోటర్ల వల్ల అతడు ప్రభావితమయ్యాడని చెప్పారు. ఐఎస్ ప్రచార కార్యకర్త మెహదీ మస్రూర్ బిశ్వాస్తో సంబంధం ఉండటంతో 2014లో బెంగళూరు పోలీసులు అబ్బాసీని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
కాగా, యూరప్, అమెరికాతోపాటు వివిధ దేశాల్లోని ఐఎస్ఐఎస్ మద్దతుదారులకు సంబంధించిన సంస్థలకు తన బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు 8.5 లక్షలను అబ్బాసీ పంపినట్లు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అలాగే ఏకే 47, ఎం4 కార్బైన్ వంటి పలు ఆయుధాలతోపాటు క్షిపణి సాంకేతికతను ఇంటర్నెట్ ద్వారా అతడు పంపినట్లు వివరించారు. తీవ్రవాద డిమాండ్లను పూర్తి చేయడానికి గొరఖ్నాథ్ ఆలయం దక్షిణ ద్వారం వద్ద విధుల్లో ఉన్న భద్రతా అధికారులపై దాడి చేసి రైఫిల్ను లాక్కోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు. అనంతరం పెద్ద ఉగ్రవాద ఆపరేషన్ చేయాలన్నది అబ్బాసీ ప్లాన్ అని పేర్కొన్నారు.