మహిళలు చాలాచోట్ల శ్మశానానికి వెళ్లరు. అంతిమ సంస్కారాల్లో పాల్గొనరు. కానీ, ఓ మహిళ అంతిమ సంస్కారాలు చేయడమే తన వృత్తిగా ఎంచుకుంది. కట్టుకున్నవాడు కడతేరిపోతే కాటికాపరై బతుకుబండిని లాగుతున్నది. కండ్లముందు మృతదేహాలు కనిపిస్తున్నా, బంధువుల ఆర్తనాదాలు చెవులకు హృదయ విదార కంగా వినిపిస్తున్నా.. ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ముత్యాల అరుణ.
అరుణది ప్రేమ వివాహం. పెండ్లయిన కొన్నేండ్లకే భర్త అనారోగ్యంతో మంచం పట్టాడు. ఇంకొన్నాళ్లకు మరణించాడు. కని పెంచిన తండ్రిది కదల్లేని స్థితి. కడుపున పుట్టిన పిల్లలది లోకం తెలియని వయసు. కుటుంబ భారమంతా అరుణ భుజాలపై పడింది. పోషణ కోసం కటువైన నిర్ణయం తీసుకుందామె. ఏ మహిళా చేపట్టని వృత్తిని ఎంచుకుంది. కాటికాపరిగా మారి, తన కుటుంబానికి అండగా నిలిచింది. ఊరూ పేరూ తెలియని అనాథ శవాలకు సైతం శ్రద్ధగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నది. కరోనా సమయంలో అరుణ చూపిన తెగువ అందరినీ ఆశ్చర్యపరిచింది. కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులే ముందుకు రాని వేళ కూడా, ఆమె వృత్తి ధర్మాన్ని వీడలేదు. ‘నా కుటుంబానికి అన్నం పెడుతున్న ఈ వృత్తిపై ఎనలేని గౌరవం ఉంది. అంత్యక్రియలు నిర్వహించడం సమాజ సేవలో భాగమని భావిస్తాను. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నా’ అంటున్నది అరుణ. కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూనే.. ఐదుగురు అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నది అరుణ.