Gold Smuggling | కేరళలో బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుతో కేరళ సీఎం పినరాయి విజయన్, ఆయన భార్య, కూతురు, ఇద్దరు సహాయకులు, ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రికి సంబంధం ఉందని ఆరోపించారు. సీఆర్పీసీలోని 164 సెక్షన్ కింద స్వప్న సురేశ్ వాంగ్మూలం ఇచ్చారు. సీఎం పినరాయి విజయన్, భార్య కమలా విజయన్, కూతురు వీణా విజయన్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నళిని నెట్టో, సీఎం అదనపు వ్యక్తిగత కార్యదర్శి సీఎం రవీంద్రన్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీ జలీల్లకు సంబంధం ఉందని పేర్కొన్నారు. సోమవారం స్థానిక మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.
2016లో కేరళ సీఎంగా పినరాయి విజయన్ తొలిసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వెళ్లినప్పుడు బంగారం స్మగ్లింగ్ మొదలైందని స్వప్న సురేశ్ ఆరోపించారు. యూఏఈలో పినరాయి విజయ్ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సీఎం విజయన్ ముఖ్య మాజీ కార్యదర్శి శివశంకర్ ఆదేశించారన్నారు. ఆ మరుసటిరోజు విజయన్ ఒక బ్యాగ్ మరిచిపోయారని, ఆ బ్యాగ్ తక్షణం పంపాలని తనను ఆదేశించారని చెప్పారు. ఆబ్యాగ్లో డబ్బులు ఉన్నాయని తెలిపారు.
పలుసార్లు విజయన్ బ్యాగులో మెటల్ తరహా ఉత్పత్తులు ఉన్నాయని స్వప్న సురేశ్ ఆరోపించారు. శివశంకర్ ఆదేశాల మేరకే ఇలా జరుగుతుందని చెప్పారు. స్వప్న సురేష్ వ్యాఖ్యలు సంకుచితం అని శివశంకర్ వ్యాఖ్యానించారు. నళిని నెట్టో స్పందించడానికి నిరాకరించారు.