Goa school tragedy : పాఠశాలలో హాకీ శిక్షణ (Hockey Training) తీసుకుంటుండగా బంతి తలకు బలంగా తగిలి 13 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. గోవాలో (Goa) ని గుయిరింలోని సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న రుయీషా ఖర్సెల్ (Ruesha Karshar) ఈ ఘటనలో మరణించింది. వేసవి సెలవులకు ముందు పాఠశాల చివరిరోజు కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా హాకీ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జరగబోయే పోటీల కోసం సిద్ధమవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. రుయీషా తలకు బంతి బలంగా తగలడంతో ఆమె మైదానంలోనే కుప్పకూలిపోయింది.
వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసినప్పటికీ అది రావడానికి సమయం పడుతుందని తెలుసుకుని పాఠశాల సిబ్బంది ఓ ప్రైవేట్ వాహనంలో రుయిషాను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక శుక్రవారం వస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్కూల్ సమయంలోనే జరిగిందని ప్రిన్సిపాల్ ఫాదర్ మిల్చెస్టర్ ఫర్టాడో చెప్పారు. తన సోదరుడు సూరజ్ను చూసి స్ఫూర్తి పొందిన రుయీషా రెండేళ్ల క్రితమే హాకీ ఆడటం ప్రారంభించింది.
పదిహేనేళ్ల సూరజ్ గత నెలలో జరిగిన సబ్-జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో గోవా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. తన చెల్లెలు ఎప్పుడూ తన హాకీ స్టిక్నే వాడేదని, ప్రాక్టీస్ సెషన్ ముగియడానికి కేవలం పది నిమిషాలు ఉందనగా ఈ ఘోరం జరిగిందని సూరజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. రుయీషా తల్లి ఓ ఇంట్లో పనిమనిషిగా, తండ్రి స్థానిక దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తె మరణవార్తతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ‘క్షమించు రుయీషా, నిన్ను కాపాడుకోలేకపోయాను. నన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయావు? దయచేసి తిరిగిరా’ అంటూ ఆమె తల్లి గుండెలవిసేలా రోదించడం స్థానికులను కంటతడిపెట్టించింది.