లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ (Chandra Shekhar Azad)పై గన్తో కాల్పులు జరిపిన కేసులో నలుగురు వ్యక్తులను హర్యానాలో అరెస్ట్ చేశారు. అంబాలాలోని షాజాద్పూర్ ప్రాంతంలో ఒక దాబా సమీపంలో ఉన్న ఆ నలుగురిని అంబాలా స్పెషల్ టాస్క్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా శనివారం అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు వికాస్, ప్రశాంత్, లోవిష్ ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్కు, నాలుగో నిందితుడు వికాస్ హర్యానాలోని కర్నాల్కు చెందినట్లు ఎస్టీఎఫ్ అంబాలా యూనిట్ డీఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. వారి నుంచి ఎలాంటి ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదని చెప్పారు.
నలుగురు నిందితులు అంబాలాలో దాక్కున్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదని అమన్ కుమార్ తెలిపారు. విచారణ కోసం వారిని ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. అయితే ఆజాద్పై కాల్పులకు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్న యూపీ పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించిన తర్వాత హర్యానాలోని అంబాలాలో ఉన్న నలుగురు నిందితులు గురించి తెలిసింది. దీంతో హర్యానా పోలీసుల సహకారంతో వారిని అరెస్ట్ చేశారు.
కాగా, బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో సహారన్పూర్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఒక కారులో వచ్చిన దుండగులు ఎస్యూవీలోని వెనుక సీటులో ప్రయాణిస్తున్న ఆయనపై దేవబంద్ ప్రాంతంలో కాల్పులు జరిపి పారిపోయారు. నాలుగు బుల్లెట్లు ఫైర్ చేయగా ఒకటి ఆయన కడుపులోకి దూసుకెళ్లింది. చంద్రశేఖర్ ఆజాద్ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత సహారన్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత గురువారం ఆయనను డిశ్చార్జ్ చేశారు.
మరోవైపు తాను ప్రాణాలతో పోరాడుతున్నప్పటికీ నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని చంద్రశేఖర్ ఆజాద్ విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న తీవ్ర నిర్లక్ష్యమని ఆరోపించారు. తనపై కాల్పులు జరిగిన సంఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. నేరస్తులను ఆయన రక్షిస్తున్నారని, దీనికి ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. తనపై దాడి జరుగడం యూపీ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. దీనికి బాధ్యత వహించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆజాద్ డిమాండ్ చేశారు.