భువనేశ్వర్, సెప్టెంబర్ 6 : ఎన్నికల సంఘం(ఈసీ) వివిధ రాష్ర్టాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ తీవ్ర విమర్శలు చేశారు. ‘సర్’ పేరుతో దేశ జనాభాల్లో 15శాతం మందిని ఓటర్ల జాబితా నుండి ఈసీ తొలగించిందని ఆయన ఆరోపించారు. ఆదివారం భువనేశ్వర్లో మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షాల విమర్శలు, ఎన్నికల ఆందోళనల నడుమ పలు రాష్ర్టాల్లో ‘సర్’ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నదని ఆరోపించారు.
భారత ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టారు. ‘తొలగించిన ఓటర్ల గణాంకాలను బయటపెట్టాలని కోరుతున్నా. తద్వారా మీరు ఎంతటి ఘన విజయం సాధించారో, అలాగే జాతీయ జనాభా కమిషన్ చేయలేని పనిని మీరు ఎలా పూర్తిచేశారో మాకు తెలుస్తుంది. భారతదేశ జనాభాలో సుమారు 15 శాతాన్ని తొలగించటం ద్వారా జనాభా నియంత్రణకు మీరు ఎంతో కృషి చేశారు’ అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ప్రస్తుతం చేపట్టిన ‘సర్’ ప్రక్రియపై ఆయన ఇంతక్రితం పలు విమర్శలు చేశారు. ‘సర్’ ప్రక్రియ వెనుక సదుద్దేశం లేదని ఆయన తప్పుబట్టారు.