న్యూఢిల్లీ: ఒక వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పింది. అతడు నడిచిన వెంటనే ఫుట్పాత్ కుంగిపోయింది. రెడ్డిట్లో బుధవారం పోస్ట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి రోడ్డు పక్కగా ఉన్న షాపులోకి వెళ్లేందుకు దాని ముందు ఉన్న ఫుట్పాత్పై నడిచాడు. అయితే అతడు పాపు మెట్లపై కాలు పెట్టిన వెంటనే ఆ ఫుట్పాత్ కుంగిపోయింది. దాని కింద లోతులో డ్రైనేజ్ ఉంది. దీంతో ఆ వ్యక్తి ఈ షాక్ నుంచి చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడు. తనకు లక్కీ డే అని అనుకున్నాడు.
కాగా, ఫుట్పాత్ కుంగిపోవడం చూసి ఆ షాప్లోని వ్యక్తులు కూడా హడావుడిగా బయటకు వచ్చారు. డ్రైనేజీలోకి కుంగిన ఫుట్పాత్ను పరిశీలించారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు.
మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై విభిన్నంగా స్పందించారు. ఆ వ్యక్తిని లక్కీ మ్యాన్, దేశంలోనే బలమైన వ్యక్తిగా అభివర్ణించారు. యముడు లంచ్ బ్రేక్ తీసుకోవడంతో ఆయనకు గండం తప్పిందని ఒకరు జోక్ వేశారు. ఆ ఫుట్పాత్ అతడి వల్లే కుంగిందని, దానికి ఆయనే డబ్బులు చెల్లించాలంటూ మరొకరు చమత్కరించారు. అయితే ఇటీవల జరుగుతున్న ఇలాంటి సంఘటనలు కొత్త భయాందోళనలు రేపుతున్నాయంటూ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.