Tamilnadu rains : తమిళనాడులోని ఎరోడ్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్ని జలమయం అయ్యాయి. దాంతో అధికారులు ఎరోడ్ జిల్లాకు వరద హెచ్చరిక జారీ చేశారు. అంతేకాదు గుండెరిపల్లం డ్యామ్ సామర్థ్యానికి మించి వరద నీరు చేరింది. అధికారులు సోమవారం 1,492 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అంతేకాదు నదులు, చెరువుల సమీపంలోకి వెళ్లకూడదని చుట్టు పక్కల గ్రామాల ప్రజలను కోరారు. ఇప్పటివరకూ ఎరోడ్లో 358.12 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎరోడ్ జిల్లాలోని సత్యమంగళం, గోబిచెట్టిపాలయం, గుండెరిపల్లం, అమ్మపేట్ ప్రాంతాల్లోని కాలువలు, చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గోబిచెట్టిపాలయంలో వరి పంట పొలాలు నీట మునిగాయి. దాంతో పంట నష్టాన్ని అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ సిబ్బందిని ఆదేశించారు.