అహ్మదాబాద్: హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ( Fire in Humsafar Express) ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళన చెందారు. గుజరాత్లోని వల్సాద్లో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుచ్చిరాపల్లి- శ్రీ గంగానగర్ హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలు వల్సాద్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఇంతలో జనరేటర్ కోచ్లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న బీ1 కోచ్కు ఆ మంటలు వ్యాపించాయి.
కాగా, హమ్సఫర్ ఎక్స్ప్రెస్లో మంటలు గమనించిన లోకో పైలట్లు అప్రమత్తమయ్యారు. ఆ రైలును వెంటనే నిలిపివేశారు. ఆందోళన చెందిన ప్రయాణికులు మంటలు వ్యాపించిన బీ1 కోచ్ నుంచి బయటపడ్డారు. అనంతరం మంటలను ఆర్పివేశారు. పవర్ కోచ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమమేనని, ఎవరూ గాయపడలేదని వెల్లడించారు.