న్యూఢిల్లీ: యోగా గురు రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై కోర్టుకెక్కిన డాక్టర్ల అసోసియేషన్పై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ దావాలు వేసే బదులు మీ విలువైన సమయాన్ని కరోనాకు మందు కనిపెట్టడానికి కేటాయించండి అని సూచించింది. మరోవైపు అలోపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్దేవ్ బాబాకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ (డీఎంఏ) దాఖలు చేసిన దావాపై విచారణ సందర్భంగా జస్టిస్ హరి శంకర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అలోపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా, తన కరోనిల్ మందు గురించి తప్పుడు ప్రచారం చేయకుండా రామ్దేవ్ బాబాను నియంత్రించాలని కోరుతూ డీఎంఏ దావా వేసింది. దీనిపై విచారణ జరిగిన ఢిల్లీ హైకోర్టు.. ఇలాంటి విషయాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయాలి తప్ప.. ఇలా దావాలు వేయడం ఏంటని ప్రశ్నించింది. రేప్పొద్దున నేను హోమియోపతి నకిలీదని నేను అంటాను. అది నా అభిప్రాయం. దీనిపై దావా ఎలా వేస్తారు? ఆయన అనేది తప్పని మీరు భావించినా, తప్పుదారి పట్టిస్తుందని అనుకున్నా.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా దీనిని వేయాలి అని జస్టిస్ హరిశంకర్ అన్నారు.
రామ్దేవ్ బాబా వ్యాఖ్యలు వాక్స్వాతంత్రం కిందికి వస్తాయి. ప్రజలకు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే హక్కు లేదా? నేను హోమియోపతి ఫేక్ అని అంటే వాళ్లంతా నాపై దావా వేస్తారా అని జస్టిస్ హరిశంకర్ ప్రశ్నిచారు. మరోవైపు జులై 13న దీనిపై మరోసారి విచారణ జరుపుతామని, అప్పటి వరకూ రామ్దేవ్ బాబా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని ఆయన తరపున లాయర్కు కోర్టు స్పష్టం చేసింది.
కరోనిల్పై తప్పుడు ప్రచారం గురించి స్పందిస్తూ.. ఒకవేళ పతంజలి నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం చూసుకుంటుంది? మీరెందుకు స్పందిస్తున్నారు? ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం. దీనిని దావాగా ఎందుకు వేశారు. కరోనిల్ కరోనాను నయం చేస్తుందని ముందు చెప్పి తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్గా మాట మార్చరని, ఆలోపే లక్షల మంది ఈ మందు కొన్నారని ఓ పిల్ దాఖలు చేయండి అని జస్టిస్ హరిశంకర్ డాక్టర్ల అసోసియేషన్కు సూచించారు.