లక్నో: ఒక వ్యక్తి తన భార్యను చంపాడు. తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (man jumped from metro station) అయితే ఇంట్లోని తల్లి మృతదేహం వద్ద చిన్నారి ఏడ్వటం చూసి పోలీసులు చలించిపోయారు. 23 ఏళ్ల గౌరవ్ శర్మ, ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో అద్దె అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన అతడు ఆదివారం భార్య లక్ష్మీ రావత్ను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. ఆ అపార్ట్మెంట్కు చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహం పక్కన ఏడుస్తున్న చిన్నారిని చూశారు. అదృశ్యమైన మహిళ భర్త కోసం వెతకసాగారు.
కాగా, గౌరవ్ శర్మ సోమవారం ఉదయం 10.30 గంటలకు అపార్ట్మెంట్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చేరుకున్నాడు. బ్లూ లైన్లో చివరి స్టేషన్ అయిన కౌశంబి మెట్రో స్టేషన్ పైకి ఎక్కాడు. స్టేషన్ అంచుకు చేరుకుని పార్కింగ్ ప్రాంతం వైపు కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడు గౌరవ్ శర్మ గురించి ఆరా తీయగా భార్యను హత్య చేసి ఇంటి నుంచి పారిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.