జైపూర్: నిరసనలో పాల్గొన్న 600 మంది రైతులు మరణించినా ఢిల్లీ నేతలు స్పందించ లేదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇస్తున్న ఆయన, పరోక్షంగా సొంత పార్టీ బీజేపీపై విమర్శలు చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు నిరసనలో 600 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
జంతువు చనిపోయినా సంతాపం తెలిపే ఢిల్లీ నేతలు, 600 మంది రైతులు మరణించినప్పటికీ వారి ప్రతిపాదనను లోక్సభలో ఆమోదించలేకపోయారని సత్యపాల్ మాలిక్ దుయ్యబట్టారు. వ్యవసాయ సమస్యలపై తాను ఏదైనా మాట్లాడితే అది వివాదం అవుతున్నదని అన్నారు.
మరోవైపు గవర్నర్ పదవి నుంచి ఆయనను తొలగించవచ్చంటూ వస్తున్న వదంతులపైనా సత్యపాల్ మాలిక్ స్పందించారు. ఢిల్లీ నుంచి పిలుపు కోసం వారాల తరబడి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ‘ఒక గవర్నర్ను తొలగించలేరు. కానీ నా శ్రేయోభిలాషులు ఏదో చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ పెద్దలు నన్ను వెళ్లిపోమని చెప్పిన రోజు.. నేను అలా చేస్తాను’ అని వ్యాఖ్యానించారు.