న్యూఢిల్లీ, జూలై 7: ఇంజినీరింగ్ కోర్సులు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతిచ్చింది. మొదటి దశలో ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కోర్సులను బోధించనున్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్ కోర్సులను ఏఐసీటీఈ ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తున్నది. మొత్తం 11 భాషల్లోకి కోర్సులను అనువాదం చేస్తున్నారు. భాష కారణంగా ఏ విద్యార్థి కూడా తాను కోరుకొన్న చదువుకు దూరం కాకూడదని, ఇంజనీరింగ్ సహా అన్ని ఉన్నతవిద్య కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించాలని జాతీయ విద్యా విధానంలో(ఎన్ఈపీ) పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో ఏఐసీటీఈ సర్వే నిర్వహించగా దాదాపు సగం మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తాము మాతృభాషలో చదవాలని అనుకొంటున్నట్టు చెప్పారు. అనంతరం ప్రాంతీయభాషలో ఇంజనీరింగ్ కోర్సుల బోధనపై ప్రొఫెసర్ ప్రేమ్ విరాట్ అధ్యక్షతన కమిటీ వేశారు. ఎన్ఐటీలు, ఐఐటీలు, ఏఐసీటీఈ అనుబంధ కాలేజీల్లో ప్రాంతీయ భాషల్లో కోర్సులను ఎంచుకోవడానికి విద్యార్థులకు ఆప్షన్ ఉండాలని ఈ కమిటీ సూచించింది. తెలుగులో బోధించేందుకు ఫ్యాకల్టీ లేరని ఐఐటీలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు ఇప్పటివరకు 9 రాష్ర్టాల్లో 14 కాలేజీలు ఆసక్తిచూపాయి. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు ఏఐసీటీఈ కాలేజీలకు అనుమతినిచ్చింది. విద్యార్థులు ప్రాంతీయ భాషల్లో కోర్సులు చేస్తున్నప్పటికీ ఈ నాలుగేండ్లు వారికి ఇంగ్లిషు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుంది. ఫ్యాకల్టీని బట్టి కాలేజీలు భిన్న భాషల్లో కోర్సులను అందించవచ్చు. ప్రాంతీయ భాషల్లో కోర్సులను అందించాలంటే కాలేజీకి ఎన్బీఏ గుర్తింపు ఉండాలి.