Interlocking system | న్యూఢిల్లీ, జూన్ 4: రైల్వేలో ప్రమాదాల నివారణకు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రైళ్లకు సమగ్రమైన పద్ధతిలో ట్రాక్లను కేటాయించేదే ఈ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ. ఏకకాలంలో ఒకే ట్రాక్పై రెండు రైళ్లు రాకుండా ఈ వ్యవస్థ నివారిస్తుంది. సిగ్నల్లో అసంబద్ధమైన మార్పులు జరగకుండా చూడటమే దీని పని. రైలు మార్గం సురక్షితమైనదేనని తేలేంత వరకు ఇది రైళ్లకు సిగ్నల్ కూడా ఇవ్వదు. రైలు ప్రయాణం సురక్షితంగా జరిగేలా ఈ వ్యవస్థ చూసుకుంటుంది. గతంలో మెకానికల్, ఎలక్ట్రో మెకానికల్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలు ఉండేవి. ఇవి ఉన్నప్పుడు సిగ్నల్ తప్పిదాలు తరచూ జరిగేవి.
దీంతో వీటి స్థానంలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. సాఫ్ట్వేర్ ఆధారిత ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్ను వినియోగించుకొని ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఎటువంటి వైర్లు మార్చకుండానే దీని ద్వారా సిగ్నల్లో మార్పులు చేయవచ్చు. ప్రాసెసర్ ఆధారంగా ఈ వ్యవస్థ కచ్చితత్వంతో వేగంగా స్పందిస్తుంది. సెన్సార్లు, ఫీడ్బ్యాక్ పరికరాలను వాడి రైళ్ల లొకేషన్ను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ట్రాక్ సర్క్యూట్, రైలు డిటెన్షన్ సిస్టమ్, పాయింట్స్, సిగ్నళ్లతో అనుసంధానమై, వాటితో సమన్వయం చేసుకుంటూ ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఒకే సమయంలో ట్రాక్పై రెండు రైళ్లు రాకుండా నివారిస్తుంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ పరిధిలోని ఖరగ్పూర్లో ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్లాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు.
ఇంటర్లాకింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నట్టు సౌత్ వెస్టర్న్ రైల్వే (నైరుతి) జోన్ అధికారులు ఫిబ్రవరిలో హెచ్చరించారు. భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. సౌత్ వెస్టర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఫిబ్రవరి 9న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులోని బ్లాక్ ప్రొవింగ్ యాక్సిల్ కౌంటర్ విఫలమై రైలుకు తప్పుడు సిగ్నల్ అందిందన్నారు. దీంతో అప్ మెయిన్ లైన్లో ప్రయాణించాల్సిన రైలు డౌన్ మెయిన్ లైన్లోకి మారినట్టు ఆయన తెలిపారు.
భువనేశ్వర్, జూన్ 4: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం స్పష్టత ఇచ్చింది. మృతుల సంఖ్య 288 కాదని, 275 అని తాజాగా ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జేన పేర్కొన్నారు. 275 మృతదేహాల్లో 78 బాడీలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించామని తెలిపారు. 10 మృతదేహాలను గుర్తించే పని కొనసాగుతున్నదని, మిగతా వాటిలో 170 మృతదేహాలను బాలాసోర్ నుంచి భువనేశ్వర్కు తరలించామని, మిగతా 17 బాడీలను కూడా తీసుకొస్తున్నామని తెలిపారు. కాగా, రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించింది.
రైలు ప్రమాదంలో అనేక మృతదేహాలు చిధ్రమైపోయాయి. దీంతో ఈ మృతదేహాలను భద్రపరచడం అధికారులకు సవాల్గా మారింది. దీంతో ఇంకా గుర్తించని, ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలను బాలాసోర్ నుంచి భువనేశ్వర్కు తరలించారు. వీటిని భద్రపరిచేందుకు మార్చురీల్లో స్థలం లేకపోవడంతో మృతుల బంధువులు గుర్తించేలా చేయాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.