Arun Goel | న్యూఢిల్లీ, మార్చి 10: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. గోయల్ రాజీనామాకు కారణంపై ప్రతిపక్షాలు బీజేపీ లక్ష్యంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గోయల్ రాజీనామాకు కారణం.. ప్రధాన ఎన్నికల కమిషనర్తో విభేదాలా? లేక మోదీ ప్రభుత్వంతో విభేదాలా? అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. అరుణ్ గోయల్ రాజీనామాకు నిజంగానే వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? లేదంటే ఆయన కూడా కలకత్తా హైకోర్టు జడ్జిలాగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్పై పోటీ చేయబోతున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.
గత పదేండ్లుగా ఎన్నికల కమిషన్ ప్రైవేటీకరణ జరిగిందని, ఇప్పుడది బీజేపీకి బ్రాంచిగా మారిపోయిందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇప్పుడున్నది టీఎన్ శేషన్ కాలం నాటి ఈసీ కాదని అన్నారు.
గోయల్పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశంసలు కురిపించారు. ‘బెంగాల్లో లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర బలగాల మోహరింపుపై బీజేపీ ఒత్తిడికి లొంగని గోయల్కు సెల్యూట్ చేస్తున్నా. ఎన్నికల పేరుతో బీజేపీ ఏం చేయాలనుకుంటున్నదో దీనిని బట్టి రుజువవుతున్నది. కేవలం ఓట్లు దండుకోవడమే వాళ్లకు కావాలి’ అని ఆమె విమర్శించారు.
అరుణ్ గోయల్ 1985 బ్యాచ్కు చెందిన పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబరులో ఈసీగా బాధ్యతలు చేపట్టారు. పదవీకాలం 2027 డిసెంబర్ 5 వరకు ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రస్తుత సీఈసీ రాజీవ్కుమార్ రిటైర్మెంట్ తర్వాత గోయల్కు సీఈసీగా అవకాశం ఉండేది. అయినప్పటికీ ఆయన ఎందుకు రాజీనామా చేశారనేది చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు ఉండాల్సి ఉండగా గత నెల అనూప్ చంద్ర రిటైర్ అయ్యారు.
ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ పదవులను ఈనెల 15 లోగా భర్తీ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి నేతృత్వంలోని కమిటీ ఒక్కో పదవికి ఐదుగురు పేర్లతో జాబితాను తయారుచేయనున్నది. ఆ తర్వాత ప్రధాని నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన తర్వాత కమిషనర్లను రాష్ట్రపతి నియమించనున్నారు.