న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే, రద్దీ రోడ్డులో దోపిడీ జరిగింది. బ్యాగులో లక్ష రూపాయల నగదు పెట్టుకుని బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి దుండగులు బ్యాగును లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 19న దేశ రాజధాని ఢిల్లీలోని మండోలీ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు బ్యాంకు నుంచి లక్ష రూపాయల నగదు విత్డ్రా చేసి బ్యాగులో పెట్టుకున్నారు. అనంతరం బయటికి వచ్చిన తర్వాత ఒకరు బైకును తీయగా, మరో వ్యక్తి నగదు బ్యాగు పట్టుకుని వెనుక కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే ఇద్దరు దొంగలు అక్కడికి వచ్చి వెనుక కూర్చున్న వ్యక్తి నుంచి బ్యాగును లాక్కెళ్లారు.
అతడు బైకుపై నుంచి పడిపోయినా బ్యాగును వదలకపోవడంతో దొంగలు కొంతదూరం ఈడ్చుకెళ్లారు. అనంతరం రోడ్డు అవతల బైకుపై వేచి చూస్తున్న మరో దొంగతో కలిసి పారిపోయారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. ప్రస్తుతం ఆ ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు..
#WATCH | Three miscreants allegedly looted Rs 1 lakh from a person in the Mandoli area on June 19. Police have registered a case and efforts are being made to identify the culprits: Delhi police
(CCTV visuals confirmed by police) pic.twitter.com/hwGsTPFsje
— ANI (@ANI) June 27, 2023