న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పేరు, చిహ్నాన్ని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్తంభింపజేసింది. పార్టీపై ఆధిపత్యం కోసం చిరాగ్ పాశ్వాన్, బాబాయ్ పశుపతి పరాశ్ మధ్య పోరు నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. బీహార్లోని రెండు స్థానాలైన కుశేశ్వర్ ఆస్థాన్, తారాపూర్లో ఈ నెల 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో చిరాగ్, కేంద్ర మంత్రి పశుపతి పరాశ్ వర్గాలు పార్టీ చిహ్నం తమకే కేటాయించాలని కోరుతూ ఈసీకి లేఖలు రాశాయి.
దీంతో లోక్ జనశక్తి పార్టీ పేరుతోపాటు ఎన్నికల గుర్తు ‘బంగ్లా’ను కేంద్ర ఎన్నికల సంఘం స్తంభించింది. ‘మెజారిటీ పార్టీ సభ్యుల మద్దతు ఎవరికి ఉందో నిర్ణయించే వరకు, ఎవరూ కూడా ఆ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదు. అటువంటి ప్రత్యర్థి విభాగాలన్నీ కమిషన్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి’ అని పేర్కొంది. బీహార్ ఉప ఎన్నికల్లో పోటీ కోసం వేర్వేరుగా పార్టీ పేర్లు, గుర్తులను సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటలోపు తమకు అందజేయాలని చిరాగ్, పరాశ్ వర్గాలను ఈసీ కోరింది.