పుణె: పాకిస్థాన్కు చెందిన మహిళా నిఘా ఏజెంట్కు ఆకర్షితుడైన డీఆర్డీవో శాస్త్రవేత్త(DRDO Scientist) ప్రదీప్ కురుల్కర్… .. భారతీయ మిస్సైల్ వ్యవస్థ రహ్యసాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. డిఫెన్స్ ప్రాజెక్టులకు చెందిన సమాచారాన్ని కూడా పాక్ ఏజెంట్కు చేరవేసినట్లు డీఆర్డీవో శాస్త్రవేత్తపై కేసు దాఖలైంది. జరా దాస్గుప్తా పేరుతో పాక్ ఏజెంట్ .. ప్రదీప్తో చాటింగ్ చేసినట్లు చార్జిషీట్లో పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు కురుల్కర్పై కేసు నమోదు చేశారు.
పుణెలోని డీఆర్డీవో ల్యాబ్లో ప్రదీప్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అయితే సీక్రెట్లు చేరవేసిన కేసులో అతన్ని గత వారం కోర్టు ముందు హాజరుపరిచారు. మే 3వ తేదీన ఆయన్ను దేశద్రోహం కేసు కింద అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
జరా దాస్గుప్తాతో వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ ద్వారా ప్రదీప్ టచ్లో ఉన్నట్లు పోలీసులు తమ చార్జిషీట్లో పేర్కొన్నారు. బ్రిటన్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటూ దాస్గుప్తా పరిచేయం చేసుకున్నది. అసభ్యకర మెసేజ్లు, వీడియోలు పంపుతూ ప్రదీప్ను ఆకర్షించింది. అయితే దాస్గుప్తా ఐపీ అడ్రస్ను ట్రేస్ చేస్తే అది పాకిస్థాన్ నుంచి ఉన్నట్లు గుర్తించారు.
బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, యూసీవీ, అగ్ని మిస్సైల్ లాంచర్, మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్తో పాటు ఇతర విషయాల గురించి పాక్ ఏజెంట్ చాలా సున్నితమైన సమాచారాన్ని రాబట్టినట్లు ఏటీఎస్ పోలీసులు చార్జ్షీట్లో వెల్లడించారు. పాక్ ఏజెంట్ వ్యామోహంలో పడిన అతను డీఆర్డీవోకు చెందిన రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత ఫోన్లో స్టోర్ చేసుకుని, దాన్ని జరాతో షేర్ చేసినట్లు చార్జ్షీట్లో పేర్కొన్నారు.
వివిధ డిఫెన్స్ ప్రాజెక్టుల గురించి ఆమెతో చాట్ చేసినట్లు ప్రదీప్పై ఆరోపణలు ఉన్నాయి. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్(ఎస్ఏఎం), డ్రోన్లు, బ్రహ్మోస్, అగ్ని మిస్సైల్ లాంచర్లు, యూసీవీల గురించి అతను చాటింగ్ చేశాడు. ఆ ఇద్దరూ జూన్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు కాంటాక్టులో ఉన్నట్లు ఏటీఎస్ పేర్కొన్నది.