న్యూఢిల్లీ: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ డెంగ్యూ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు ఆయన సతీమణి గురుశరణ్ కౌర్ తెలిపారు. మన్మోహన్ ఇంటికి వచ్చారని, ఆయన డెంగ్యూ నుంచి తేరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ఎయిమ్స్ వైద్యులు, నర్సులు, సపోర్ట్ స్టాఫ్కు ప్రత్యేక ధన్యవాదులు తెలుపుతున్నట్లు ఆమె వెల్లడించారు. మన్మోహన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు.
డెంగ్యూ దడ..
మరో వైపు ఢిల్లీలో డెంగ్యూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. డెంగ్యూ జ్వరం వల్ల ఢిల్లీలో అయిదుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ .. డెంగ్యూపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఏడాది డెంగ్యూ వల్ల ఢిల్లీలో ఒక్కరు మృతిచెందారు. 2019లో ఇద్దరు, 2018లో నలుగురు చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2015లో డెంగ్యూకు అత్యధికంగా 60 మంది బలయ్యారు. అక్టోబర్ 30 నాటికి కొత్తగా 531 డెంగ్యూ కేసులు ఢిల్లీలో నమోదు అయ్యాయి. దీంతో ఈ ఏడాది మొత్తం కేసుల సంఖ్య 1537కు చేరుకున్నది. వాటిల్లో కేవలం అక్టోబర్లోనే 1196 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బెడ్స్ను డెంగ్యూ పేషెంట్లకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.