కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ 2019లో నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పెళ్లి టర్కీలో జరిగిందని, అది భారతీయ వివాహం చట్టం పరిధిలోకి రాదు అని, అందుకే విడాకుల అంశాన్ని కూడా ఎవరు లేవనెత్తలేరని తాజాగా నుస్రత్ ఓ ప్రకటన జారీ చేశారు. రెండు వేరువేరు విశ్వాసాలకు చెందిన పెళ్లికి.. ఇండియాలో ప్రత్యేక అనుమతి అవసరం ఉంటుందని, కానీ తాము భారతీయ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకోలేదని ఆమె అన్నారు. అసలు తమది పెళ్లే కాదు అని, మాదొక రిలేషన్షిప్ అని, కేవలం సహజీవనం మాత్రమే అని, దానికి విడాకులు ఇవ్వాల్సిన పనిలేదని నుష్రత్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
జైన్తో తానెన్నెడో విడిపోయానని, కానీ దాని గురించి తానెప్పుడూ మాట్లాడలేదని, ఎందుకంటే వ్యక్తిగత జీవితాన్ని బయట చర్చించలేమని, మేం వేరుపడ్డ అంశం ఆధారంగా ఎవరూ మమ్మల్ని ప్రశ్నించలేరని జహాన్ అన్నారు. నిఖిల్ జైన్ అక్రమరీతిలో తన అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసినట్లు కూడా ఆమె ఆరోపించారు. ప్రస్తుతానికి నుష్రత్ ప్రెగ్నెంట్ అని, మరీ చాన్నాళ్ల నుంచి దూరంగా ఉంటే ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నలు ఇటీవల తలెత్తాయి. ఆ నేపథ్యంలో నుష్రత్ ఈ ప్రకటన జారీ చేశారు.
తాను చేసుకున్న పెళ్లికి గుర్తింపు లేదని ఎంపీ నుష్రత్ ప్రకటన చేయగా.. బీజేపీ ఎంపీలు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.జైన్తో పెళ్లి కాలేదని నుష్రత్ చెబుతోందని, అంటే ఆమె పార్లమెంట్లో అబద్దం చెప్పిందా అని బీజేపీ నేత అమిత్ మాల్వియా ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో నుష్రత్ జహాన్ రూహీ జైన్ అని ఆమె పలికారని, దానికి సంబంధించిన వీడియో క్లిప్ను ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేశారు. నుస్రత్ ఓ ఎన్నికైన ప్రజాప్రతినిధి అని, పార్లమెంట్ రికార్డుల్లో ఆమె పెళ్లి చేసుకున్నట్లు ఉందని, అందుకే తాను ఈ డౌట్ను వ్యక్తం చేస్తున్నట్లు మాల్వియా తెలిపారు.