Maha Dy CM Fadnavis | మహారాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు జరుగుతున్నాయి. మైనారిటీలో పడ్డ ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో బీజేపీ-శివసేన ఏక్నాథ్ షిండే వర్గం ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గురువారం ఫడ్నవీస్ నివాసంలో ఆయన్ను శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే కలుసుకున్నారు. ఈ సందర్భంగా తదుపరి సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు.
తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్షా మరో సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపడతారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అభ్యర్థన మేరకు మహారాష్ట్ర రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారని ట్వీట్ చేశారు.
అంతకుముందు ట్విట్టర్ వేదికగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. తమ వ్యక్తిగత అభ్యర్థన మీద దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారు అని తెలిపారు.