న్యూఢిల్లీ: కరోనా థార్డ్వేవ్ దేశంలోకి ఎంటర్ అయ్యిందని, దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కొత్తగా పది వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కానున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. పాజిటివిటీ రేటు 10 శాతానికి చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ పేషెంట్లకు రిజర్వ్డ్ మంచాల సంఖ్యను 40 శాతానికి పెంచాలని ప్రైవేటు హాస్పిటళ్లకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటళ్లలో రెండు శాతం బెడ్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి జైన్ తెలిపారు. ఎన్నికల ఉద్దేశంతో నిర్వహిస్తున్న ర్యాలీలపై ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయమంటారా అని ప్రశ్నించారు.
మంగళవారం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.3 శాతంగా ఉందని, సోమవారం ఆ రేటు 6.46గా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇండియాలోకి థార్డ్ వేవ్ ఎంటరైందని, అయితే ఢిల్లీలో ప్రస్తుతం ఫిఫ్త్ వేవ్ నడుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నా.. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఢిల్లీ నుంచి ప్రతి రోజు 400 శ్యాంపిళ్లను బయటకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ టెస్టింగ్ సంఖ్యను పెంచామని, రోజుకు దాదాపు 90 వేల పరీక్షలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.