28 వారాల గర్భవతికి ఢిల్లీ హైకోర్టు అనుమతి
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న పిండాన్ని తొలగించాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు మన్నించింది. సమస్యలతో కూడుకొన్న గర్భాన్ని తొలగించుకోవడం అనేది రాజ్యాంగం లోని 21 అధికరణంలోని వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు వస్తుందని నొక్కి చెప్పింది. సదరు మహిళ 28 వారాల గర్భాన్ని వైద్య పర్యవేక్షణలో తొలగించాలని జస్టిస్ జ్యోతిసింగ్ శనివారం ఆదేశించారు. కడుపులో ఉన్న శిశువుకు అసాధారణమైన జన్యుపరమైన గుండెజబ్బుతో ఉన్నదని, పుట్టిన తర్వాత నిరంతరం వైద్య పర్యవేక్షణలోనే గడపాల్సి వస్తుందని అన్నారు. గర్భవిచ్ఛిత్తికి అనుమతించక తప్పదని అభిప్రాయపడ్డారు. ఆలస్యంగా గర్భవిచ్ఛిత్తి పర్యవసానాలపై ఈ కేసులో నియమితమైన వైద్యబోర్డు పిటిషనర్ మహిళకు, ఆమె భర్తకు వివరించాలని సూచించింది.