న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకే పెరుగుతున్నది. గత వారం రోజుల నుంచి వరుసగా గాలి నాణ్యత క్షీణిస్తున్నది. దాంతో ఢిల్లీ నగరం అంతటా దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉంటున్నది. ఈ పొగమంచు కారణంగా కొద్దిదూరం కూడా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవాళ ఢిల్లీలో సగటు గాలి నాణ్యత రికార్డు స్థాయిలో 346కు పడిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ ఏరియాలో AQI 371గా ఉన్నది. పుసా ఏరియాలో కాస్త తక్కువగా AQI 341గా నమోదైంది. ధిర్పూర్ ఏరియాలో అత్యంత అధ్వాన్నంగా AQI 460 ఉన్నది. నోయిడాలో AQI 438గా రికార్డయ్యింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని అర్థం. AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని, AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం.