న్యూఢిల్లీ: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) క్లియరెన్స్ లేకుండానే ఒక విమానం టేకాఫ్ అయ్యింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు ముగిసే వరకు ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించింది. డిసెంబర్ 30న గుజరాత్లోని రాజ్కోట్ నుంచి ఢిల్లీ వెళ్లే స్పైస్జెట్ విమానం ఏటీసీ క్లియరెన్స్ కోరకుండానే టేకాఫ్ అయ్యింది. దీంతో తమ అనుమతి లేకుండా ఎలా ప్రయాణించారని రాజ్కోట్ ఏటీసీ సిబ్బంది ఆ విమానం పైలట్లను అడిగారు. పొరపాటు జరిగిందన్న పైలట్లు దీనికి క్షమాపణ చెప్పారు.
ఆ విమానం టేకాఫ్ అయినప్పుడు ఏటీసీ సిబ్బంది, పైలట్ల మధ్య ఈ సంభాషణ జరిగిందని రాజ్కోట్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. ఫ్లైట్ షెడ్యూల్ ప్రకారం SG-3703 ఢిల్లీకి టేకాఫ్ కావడానికి సమయానికి ఉందన్నారు. అయితే పైలట్లు తప్పనిసరి అనుమతి తీసుకోకుండా టేకాఫ్ చేయడాన్ని ఏటీసీ సిబ్బంది గుర్తించినట్లు చెప్పారు. దీనిపై సవివరమైన నివేదికను డీజీసీఏకి పంపినట్లు వెల్లడించారు.