Rajnath Singh : యుద్ధ ట్యాంకులు దేశ సరిహద్దుల్లో ఉక్కు గోడల్లాంటివని రక్షణశాఖ మంత్రి (Deffence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పేర్కొన్నారు. డ్రోన్లు (Drones), క్షిపణుల (Missiles) పాత్ర పెరుగుతున్నప్పటికీ భూతల దాడుల్లో యుద్ధ ట్యాంకులు కీలకమని తెలిపారు. అవి శత్రువులపాలిట సింహస్వప్నంలా నిలుస్తాయని, యుద్ధక్షేత్రంలో సైనికుల మనోధైర్యాన్ని పెంచుతాయని చెప్పారు.
మధ్యప్రదేశ్లోని ‘వెహికల్ ఫ్యాక్టరీ జబల్పుర్’ లో టీ-సిరీస్ యుద్ధ ట్యాంకుల మరమ్మతుల కోసం రూ.472 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం రాజ్నాథ్ ప్రసంగించారు. అత్యంత శక్తిమంతమైన సైన్యం కలిగిన దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. డ్రోన్లు, క్షిపణులు, ఇతర అధునాతన సాంకేతికతలతో యుద్ధం తీరు వేగంగా మారుతోందని చెప్పారు. అంతమాత్రాన ట్యాంకులు ప్రాధాన్యం కోల్పోయాయని కాదని చెప్పారు.
రణరంగంలో ఒకే వ్యవస్థపై ఆధారపడకుండా సమష్టి సామర్థ్యం కలిగి ఉండటం అవసరమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. డ్రోన్లు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలతోపాటు ఆధునిక ట్యాంకులూ ముఖ్యమేనని చెప్పారు. భూతల దాడుల్లో టీ-72, టీ-90 ట్యాంకులు ఎంతో కీలకమని దేశ సరిహద్దుల్లో అవి ఉక్కు గోడలా నిలుస్తాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న కేంద్రంలో ఏటా 80 ట్యాంకులకు మరమ్మతులు చేయొచ్చు’ అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.