ముంబై, మార్చి 25: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని లోక్సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ చర్య ప్రజాస్వామ్య విలువల దిగజారుడుతనాన్ని వెల్లడిస్తున్నదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
శనివారం ఈ మేరకు ట్వీట్ చేస్తూ గతంలో లక్షద్వీప్కు చెందిన తమ పార్టీ ఎంపీ మహమ్మద్ ఫైజల్కు హత్య కేసులో శిక్షపడటం, దీంతో అతడిపై పార్లమెంట్ నిషేధం విధించడం, తర్వాత ఆ శిక్షను కేరళ హైకోర్టు కొట్టివేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ప్రతి పౌరుడు సరైన న్యాయం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సమాన హోదా, సమానత్వం, సౌభ్రాతృత్వం పొందే హక్కును, హామీని రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగ వ్యవస్థలు కల్పించిన వీటిని పరిరక్షించుకోవడానికి మనం అందరం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉన్నది’ అని శరద్ పవార్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.