మదురై: తండ్రీ కొడుకుల లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ తమిళనాడులోని మదురై మొదటి తరగతి జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది. అలాగే వారికి రూ.కోటి జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి ఆ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. కొవిడ్ సమయంలో తమ దుకాణాన్ని తెరచి ఉంచారన్న ఆరోపణలపై జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ను తుత్తుకూడి జిల్లా సాతన్కుళం పోలీసులు 2020 జూన్ 19న స్టేషన్కు తీసుకు వచ్చారు.
ఆ రోజు రాత్రంతా వారిని చితకబాది మరునాడు కోవిపట్టి సబ్జైల్కు తరలించారు. తీవ్ర గాయాలతో కోవిపట్టి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ బెనిక్స్ జూన్ 22న మరణించగా, అతని తండ్రి జయరాజ్ ఆ మరునాడు కన్నుమూశాడు. దీంతో కేసు విచారించిన జడ్జి జీ ముత్తుకుమారన్ అప్పటి స్టేషన్ ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లను నిందితులుగా పేర్కొంటూ వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.