Cyclone Remal | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారింది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్లోని సాగర్ దీవుల మధ్య, బంగ్లాదేశ్లోని ఖేపుపరా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. కోల్కతాతో సహా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో రెమాల్ తుఫాను ప్రభావం కారణంగా పెనుగాలులు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
కోల్కతాలోని విమానాశ్రయంలో కార్యాకలాపాలను నిలిపివేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు విమానాశ్రయం మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా మేదినీపూర్, హౌరా, హుగ్లీ, జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆయా ఈదురు గాలులతో అత్యంత భారీ వర్షాపాతం (24 గంటల్లో 204 మి.మీ కంటే ఎక్కువ) నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే, ఉత్తర ఒడిశా, బెంగాల్లో సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రెమాల్ తుఫాను ఉత్తర దిశగా కదులుతూనే ఉందని.. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఒడిశాలోని మయూర్భంజ్, భద్రక్, కెందుజార్, బాలేశ్వర్, జాజ్పూర్, కేంద్రపారా, కటక్, జగత్సింగ్పూర్, ఖుర్దా, పూరీ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో త్రిపుర ప్రభుత్వం ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది.