కోల్కతా: బెంగాల్ నాలుగవ దశ ఎన్నికల్లో భారీ హింస చోటుచేసుకున్నది. కూచ్ బెహర్ జిల్లాలోని సితాల్కుచి నియోజకవర్గంలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోయారు. అయితే ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. సితాల్కుచిలో నలుగుర్ని సీఆర్పీఎఫ్ దళాలు కాల్చి చంపినట్లు ఆరోపించారు. ఎన్నికల సభలో మాట్లాడుతూ ఇవాళ ఉదయం మరో చోట కూడా ఇలాంటి సంఘటన జరిగిందన్నారు. తనకు సీఆర్పీఎఫ్ అంటే శత్రుత్వం ఏమీ లేదని, కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాలతో ఇక్కడ కుట్ర జరుగుతోందని, దానికి ఈ ఘటన నిదర్శనమని దీదీ అన్నారు. క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ దళాలు కాల్చి చంపినట్లు ఆమె ఆరోపించారు. ఆభద్రతా దళాలకు అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందని ఆమె అడిగారు. ఈ ఎన్నికల్లో ఓడినట్లు బీజేపీ గుర్తించిందని, అందుకే వాళ్లు ఓటర్లను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నలుగురు మృతిచెందిన ఘటనా స్థలిని రేపు సీఎం మమతా బెనర్జీ సందర్శించనున్నారు. కూచ్ బెహర్లో ఆమె నిరసన ర్యాలీ కూడా చేపట్టనున్నారు.
కాల్పుల ఘటనపై సీఆర్పీఎఫ్ స్పందించింది. జోర్పాట్కీ 126 పోలింగ్ బూత్ వద్ద జరిగిన సంఘటనపై ప్రకటన చేసింది. అసలు ఆ బూత్ వద్ద సీఆర్పీఎఫ్ దళాలు విధుల్లో లేవని, ఆ సంఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని సీఆర్పీఎఫ్ చెప్పింది.