Covid-19 | సింగపూర్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కొవిడ్ కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని కొత్త వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం వారంరోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ర్యాండమ్గా శాంపిల్స్ తీసుకుని సర్వే చేపట్టనున్నారు. మారిన కొవిడ్ స్వరూపం కారణంగా ప్రమాదం, ఆందోళన కలిగించే విషయం కాదని ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ చెందిన అధికారులతో పాటు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జూన్ రెండోవారంలో జరిగే ర్యాండమ్ శాంపిల్ సర్వే నివేదిక ఆధారంగా తర్వాత వ్యూహాన్ని రూపొందించనున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో జరిగిన కీలక సమావేశంలో కొవిడ్ మారిన రూపం ద్వారా ప్రభావితమైన రోగులు, రాష్ట్రాలపై చర్చించారు. సమాచారం మేరకు.. కేపీ.1, కేపీ.2 వేరింట్లకు సంబంధించి 325 వెలుగులోకి వచ్చాయి. ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 34 కేపీ.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా బెంగాల్లోని 23 కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్రలో నాలుగు, గుజరాత్, రాజస్థాన్ ఇద్దరికి వైరస్ సోకినట్లు గుర్తించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గోవా, హర్యానా, ఉత్తరాఖండ్లో కొత్త వేరియంట్ కేసులు ఒక్కొక్కటి చొప్పన నమోదయ్యాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు సుమారు 290 కేపీ.2 వేరియంట్ కేసులు నమోదవగా.. ఇందులో మహారాష్ట్రలోనే 148 కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ బెంగాల్లో 36, రాజస్థాన్లో 21, గుజరాత్లో 23, ఉత్తరాఖండ్లో 16, గోవాలో 12, ఒడిశాలో 17, ఉత్తరప్రదేశ్లో 8, కర్ణాటకలో 4, హర్యానాలో 3, మధ్యప్రదేశ్, ఢిల్లీలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్లు, సబ్ వేరియంట్లపై నిఘా వేసేందుకు ర్యాండమైజ్ శాంపిల్స్ సర్వే సేకరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసులు నమోదైన రాష్ట్రాల్లో రాబోయే రెండువారాల పాటు ఇంటెన్సివ్ మానిటరింగ్తో పాటు శాంపిల్స్ సేకరించాలని చెప్పింది.
అయితే, వేరియంట్లతో ప్రమాదమేమీ లేకపోయినప్పటికీ.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా గమనిస్తుందని సంబంధిత శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. మరో వైపు డాక్టర్ ఎన్కే అరోరా కొత్త కేసులతో భయపడాల్సిన అవసరం ఏమీ లేదని పేర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న కేసులను పరిగణలోకి తీసుకొని ర్యాండమ్ శాంపిల్ సర్వేకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులు నమోదైన ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉన్నారన్నారు.