న్యూఢిల్లీ, జూలై 1: విశ్వ రహస్యాల ఛేదనలో గురువారం కీలక అడుగు పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపు నిర్మాణం రెండు ఖండాల్లో ప్రారంభమైంది. స్కేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ(ఎస్కేఏవో)గా నామకరణం చేసిన ఈ టెలిస్కోపును దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో నిర్మిస్తున్నారు. 2029కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నది. దీని నిర్మాణానికి రూ.17,680 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. ఈ టెలిస్కోపు నిర్మాణ ప్రతిపాదన 30 ఏండ్ల కిందటిది. దీనికోసం ఏడు దేశాలు(ఆస్ట్రేలియా, చైనా, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, యూకే) ఎస్కేఏవో కౌన్సిల్ను ఏర్పాటు చేశాయి.గతవారం ఈ కౌన్సిల్ సమావేశం జరిగింది. టెలిస్కోపు నిర్మాణంపై నిర్ణయాన్ని ఈ సమావేశంలోనే తీసుకొన్నారు. కొవిడ్ వల్ల నిర్మాణ పూర్వ పనులు కాస్త ఆలస్యం అయినట్టు ఎన్కేఏవో కౌన్సిల్ తెలిపింది. కౌన్సిల్ ప్రధాన కార్యాలయం యూకేలో ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారం అయిందని ఎస్కేఏవో డైరెక్టర్ జనరల్ ఫిలిప్ డైమండ్ చెప్పారు. ఎస్కేఏవోలో ఇండియా అబ్జర్వర్ మెంబర్గా ఉంది. అధికారికంగా ఎస్కేఏవో కౌన్సిల్లో సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్నది.
డిజైన్పై ఏడేండ్లు పరిశోధనలు
ఎస్కేఏవో రేడియో టెలిస్కోపు డిజైన్, ఇంజనీరింగ్ పనులపై ఏడేండ్లుగా పరిశోధనలు జరిగాయి. టెలిస్కోపు డిజైన్కు ఫిబ్రవరిలో తుదిరూపు వచ్చింది. దీని నిర్మాణంలో భాగంగా దక్షిణాఫ్రికాలోని కరూ ఎడారిలో 197 డిష్లు, పశ్చిమ ఆస్ట్రేలియాలో 1,31,072 యాంటెన్నాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ డిష్లు ఒక్కోటి 50 అడుగుల దూరంలో చదరపు కిలోమీటర్ వైశాల్యంలో విస్తరించి ఉంటాయి. ఈ టెలిస్కోపు విశ్వంతరాళానికి సంబంధించి ఏటా 700 పెటాబైట్ల సమాచారాన్ని అందించనున్నది. ప్రస్తుతం ఖగోళ పరిశోధనలకు వాడుతున్న అన్ని టెలిస్కోపుల కన్నా ఎస్కేఏవో 10 రెట్లు శక్తిమంతమైంది.
40 దేశాల శాస్త్రవేత్తలకు భాగస్వామ్యం
ఈ టెలిస్కోపు సాయంతో శాస్త్రవేత్తలు జీవం పుట్టుక, గెలాక్సీల పుట్టుక, ఖగోళ అయస్కాంత క్షేత్రాలు, గురుత్వాకర్షణ తరంగాలు, హైడ్రోజన్ వాయువు తదితర అంశాలపై పరిశోధనలు, అధ్యయనాలు చేయనున్నారు. 40 దేశాలకు చెందిన 1,000 పరిశోధకులు ఇందులో పాల్గొంటారు.