న్యూఢిల్లీ : ఆర్మీ నియామకాల కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఈనెల 27న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నిర్వహిస్తుందని ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ బుధవారం పేర్కొన్నారు. సత్యాగ్రహంలో అన్నినియోజకవర్గాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిరసనలు చేపడతారని చెప్పారు.
అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా తమ పోరాటం నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఇక అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అగ్నిపథ్ను తక్షణమే వెనక్కితీసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. తాత్కాలిక సైనిక నియామక పధకంతో కేంద్రం ఆర్మీని నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. కాషాయ పాలకులు వన్ ర్యాంక్..వన్ పెన్షన్ గురించి మాట్లాడతరాని, వారు ఇప్పుడు నో ర్యాంక్..నో పెన్షన్తో ముందుకొచ్చారని ఎద్దేవా చేశారు.
చైనా మన సరిహద్దుల్లో కూర్చుంటే మనం సైన్యాన్ని బలహీనపరిచే చర్యలు చేపడుతున్నామని, ఇది దేశ ప్రయోజనాలకు హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయవాదులమని చెప్పుకుంటూ కాషాయ పాలకులు సైన్యాన్ని బలహీనపరుస్తున్నారని అన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన మాదిరిగానే అగ్నిపథ్ను కూడా రద్దుచేయాలని మోదీ సర్కార్ను రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.