జైపూర్ : రాజస్ధాన్లోని ఆల్వార్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు టీనేజ్ బాలికలపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఆదివారం 19 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఏడుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడగా, సోమవారం 16 ఏండ్ల బాలికను అపహరించి నలుగురు వ్యక్తులు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జులై 4న ఇంటి నుంచి బయటకు వచ్చిన 19 ఏండ్ల బాలికను అపహరించిన ఏడుగురు వ్యక్తులు ఆమెపై అల్వార్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
నిందితులను తాహిర్ అలి, సద్దాం, సాజిద్, వాసం, పర్వేజ్, చతుర్, అర్బాజ్లుగా గుర్తించారు. బాలికపై లైంగిక దాడికి తెగబడ్డ అనంతరం ఆమెను నిందితులు రోడ్డుపై విడిచిపెట్టి వెళ్లారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామని ఆల్వార్ పోలీసులు తెలిపారు. ఇక సోమవారం మంచినీరు తీసుకువచ్చేందుకు ఆల్వార్ ప్రాంతంలో తన ఇంటి నుంచి బయటకు వచ్చిన 16 ఏండ్ల బాలికను కారులో అపహరించిన నిందుతులు వాహనంలోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కృష్ణగర్ బాస్ ప్రాంతంలో గ్రామస్తులు ముగ్గురు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించగా మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.