న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయపెడుతున్నది. మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే.. దేశంలో మాస్క్ల ఆవశ్యకత, వినియోగాన్ని అర్థం చేసుకోవడంపై నిర్వహించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో మాస్క్ పెట్టుకోవడం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే, ముగ్గురిలో ఇద్దరు భారతీయులు క్లాత్ మాస్క్లను ఉపయోగిస్తున్నారు. వాటిని కరోనా సోకకుండా ఉండేందుకు పనికొస్తున్నట్లు కనిపించడం లేదని గుర్తించారు. లోకల్ సర్కిల్ నిర్వహించిన ఈ సర్వేలో అమెరికాలో మాదిరిగా 67శాతం మంది భారతీయులు ఎన్95 మాస్క్లను ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు. కమ్యూనిటీ స్థాయిలో ఎన్95, కేఎన్95, ఎఫ్ఎఫ్పీ2 మాస్క్లను అందుబాటులో ఉంచాలని సర్వేలో 9,902 మంది కోరారు.
అమెరికాలో మాస్క్ల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 400 మిలియన్ ఎన్95 మాస్క్లు ఉచితంగా అందుబాటులో ఉంచింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో ఇటీవల వీడియోకాన్ఫరెన్స్ సమావేశమై.. మాస్క్ల అవసరాన్ని నొక్కి చెప్పిన సమయంలోనే సర్వే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించని వారికి పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తున్నాయి.
ఎన్-95 మాస్క్లు సురక్షితమని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా థర్డ్వేవ్ మధ్య వైరస్ను నియంత్రించడంలో ఎన్95, కేఎన్95 మాస్క్లు మాత్రమే సమర్థవంతంగా పని చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. సర్జికల్ మాస్క్లు కరోనా ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా పరిమితంగా మాత్రమే రక్షణను అందజేస్తాయని చెబుతున్నారు. క్లాత్ మాస్క్లు ప్రమాదకరమని.. వైరస్ నుంచి చాలా తక్కువ రక్షణ కల్పిస్తాయన్నారు.
లోకల్ సర్కిల్ ఆధ్వర్యంలో ఒమిక్రాన్ వేరియంట్ సంక్రమణను పరిశీలించారు. ఇందులో భాగంగా ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తుల(ఒమిక్రాన్ సోకిన వ్యక్తి, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న)ను ఆరు అడుగుల దూరంలో ఉంచారు. ఈ పరీక్షలో ఇంట్లోని వారిద్దరూ ఎన్95 మాస్క్లు వాడితే మూడు గంటల నుంచి 24 గంటల వ్యవధిలో ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకుతుందని తేలింది. అయితే, వైరస్ సోకిన వ్యక్తి నుంచి మాస్క్ ధరించకపోయినా, క్లాత్ మాస్క్ ధరించినా వైరస్ కేవలం రెండు నిమిషాల్లోనే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సోకుతుందని గుర్తించారు. అయితే, సర్జికల్ మాస్క్లు ధరించిన బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తికి నాలుగు నిమిషాల్లో సోకుతుందని తేలింది.