ముంబై : నాగ్పూర్లోని గోధాని గ్రామంలో ఉన్న నీటిశుద్ధి కేంద్రంలో క్లోరిన్ గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టించింది. అధికారుల వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున 1గంటకు నీటిశుద్ధి కేంద్రంలోని 900 కిలోల సామర్థ్యం గల సిలిండర్ నుంచి క్లోరిన్ గ్యాస్ లీకేజీ మొదలైంది. సమీప నివాసాలకు గ్యాస్ వ్యాపించడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. అనేక మంది దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.
నీటిశుద్ధి కేంద్రానికి సుమారు 200 మీటర్ల పరిధిలోని ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 56 మంది అస్వస్థతకు గురవడంతో దవాఖానకు తరలించారు. ఇందులో 45 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగి గ్యాస్ను అదుపు చేస్తున్నట్టు నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.