న్యూఢిల్లీ: యమునా నదిలో కాలుష్యం త్రీవ స్థాయిలో ఉన్నది. ఢిల్లీ పరిసరాల్లో భారీగా నది నీటిలో నురగ ప్రవహిస్తున్నది. సమీప ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్ధాల వల్ల .. యమునా నదిలో నురగలు ఉప్పొంగుతున్నాయి. అయితే మరో వైపు ఛాత్ పూజ నిర్వహిస్తున్న భక్తులు.. ఆ నురగ నీటిలోనే దిక్కుతోచని స్థితిలో పూజలు చేస్తున్నారు. యమునా నదిలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఢిల్లీలోని కాలిందీ కుంజ్ ప్రాంతంలో ఇవాళ ఉదయం కొందరు భక్తులు ఆ కాలుష్య నీటిలోనే పూజలు చేశారు. విషపూరితమైన నురగ జోరుగా ప్రవహిస్తుంటే, భక్తులు ఆ నీటిలోనే పుణ్య స్నానాలు చేశారు. యమునా నది చాలా దుర్గందమైందని, అది ప్రమాదమని తెలుసని ఓ భక్తురాలు అన్నారు. కానీ ప్రవహిస్తున్న నీటి నుంచి సూర్య దేవుడికి పూజలు చేసేందుకు మరో మార్గం లేకుండాపోయిందన్నారామె.
యమునా నదిలో విషపూరిత నురగ ప్రవహిస్తున్న అంశంపై ఆమ్ ఆద్మీ నేత రాఘవ చద్దా స్పందించారు. ఓక్లా బ్యారేజ్ వద్ద యమునా నదిలో నురగ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది యూపీ వ్యవసాయశాఖ కిందకు వస్తుందన్నారు. ఇది యూపీ ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈ సారి కూడా వాళ్లు విఫలమైనట్లు చెప్పారు. విషపూరితమైన నీళ్లు ఢిల్లీవి కావు అని, అవి యూపీ, హర్యానా నుంచి వస్తున్నట్లు ఆరోపించారు. ఓక్లా బ్రిడ్జ్ వద్ద చేరుతున్న నీటిలో పరిశ్రమల వ్యర్థాలు ఉంటున్నాయని, ట్రీట్మెంట్ చేయడం అమోనియా వల్ల నీటిలో నురగలు వస్తున్నట్లు ఆప్ నేత తెలిపారు.