Pragyan Rover | బెంగళూరు, ఆగస్టు 19: చంద్రయాన్-3 చంద్రుడి దిశగా పరుగులు పెడుతున్నది. అన్నీ సజావుగా సాగి చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపితే భారత్ చరిత్ర సృష్టించనున్నది. ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని అనేక రహస్యాలను ఇది బయటపెట్టనున్నది. అయితే ఈ పరిశోధనల్లో ముఖ్య పాత్ర పోషించేది మాత్రం ప్రజ్ఞాన్ రోవర్.
ప్రజ్ఞాన్ అంటే సంస్కృతంలో విజ్ఞానం అని అర్థం. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఆరు చక్రాలతో జాబిల్లిపై పరుగులు పెట్టే దీని బరువు 26 కిలోలే. చంద్రుడి ఉపరితలంపై సేకరించే సమాచారాన్ని ఇది ల్యాండర్ విక్రమ్ సాయంతో భూమికి చేరవేస్తుంది. తనతో పాటు అనేక పరికరాలు, సెన్సార్లను ఇది తీసుకెళ్తున్నది. ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (ఏపీఎక్స్ఎస్), లేజర్ ప్రేరిత బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ (ఎల్ఐబీఎస్) సహా ప్రయోగాలు జరిపే పరికరాలు ఇందులో ఉంటాయి. ఖనిజాలు, పగలు- రాత్రి చక్రం, అణువులు, మట్టి, నీటి జాడ, సన్నని ఉపరితల వాతావరణం తదితర అంశాలపై రోవర్ దృష్టి సారిస్తుంది.
చంద్రయాన్-3 మిషన్కు సంబంధించి ఆదివారం మరో కీలక ఘట్టం జరగనున్నది. రెండో డీబూస్టింగ్ (ల్యాండర్ వేగం తగ్గింపు) ప్రక్రియను ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు చేపట్టనున్నట్టు ఇస్రో వెల్లడించింది. ఈ విన్యాసం అనంతరం ల్యాండర్ చంద్రుడికి మరింత చేరువ కానున్నది. పెరిలూన్ కక్ష్యలోకి ల్యాండర్ ప్రవేశించనుంది. ఈ కక్ష్య నుంచే ఈ నెల 23న సాఫ్ట్ ల్యాండింగ్ నిర్వహించనున్నారు.