హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తేతెలంగాణ): అడవికి రారాజు సింహం అంటారు కానీ.. నిజానికి అసలైన రాజు పెద్దపులి. అడవిలో పెద్దపులి ఠీవిగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతటి భారీ జంతువైనా భయంతో బిక్కచచ్చిపోవాల్సిందే. ఇప్పుడు మనదేశంలోని అడవులను పెద్దపులులే ఏలుతున్నాయి. అయితే, దేశంలో పులులు ఎన్ని ఉన్నాయి? వాటిని ఎలా లెక్కిస్తారు? అనే కుతూహలం చాలామందిలో ఉంటుంది. దట్టమైన అడవుల్లో ఉండే పులులను లెక్కించటం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. కొన్ని వేలమంది అడువుల్లో కష్టపడి సేకరించిన సమాచారంతో పులుల లెక్కలు తేలుస్తారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ డిసెంబర్-జనవరి నెలల్లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో 5వ విడత జాతీయ పులుల గణన చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో పులుల గణనకు అనుసరించే పద్ధతుపై ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక కథనం.
పులుల లెక్కింపు ఇలా..
మనదేశంలో ప్రతి నాలుగేండ్లకోసారి వన్యప్రాణుల గణన నిర్వహిస్తారు. పెద్దపులి, చిరుత, అడవికుక్కలు, అడవి పిల్లులు, తోడేలు, నక్కలు, ఎలుగుబంటి వంటి జంతువుల సంఖ్యను అంచనా వేస్తారు. అడవులను బీట్లుగా వర్గీకరిస్తారు. దేశంలో సుమారు 45 వేల ఫారెస్ట్ బీట్లు ఉన్నాయి. ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం రాష్ర్టాల అటవీశాఖల ఆధ్వర్యంలో పులుల గణన జరుగుతుంది. తెలంగాణలోని 3,038 ఫారెస్ట్ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఇందులో సుమారు 9 వేలమంది పాల్గొంటారు. పులుల లెక్కింపు దేశం మొత్తం ఒకే సమయంలో వారంపాటు నిర్వహిస్తారు.