Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. ఏడు దశల ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న (EC) ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్నికల తేదీల నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. మార్చి 20న తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 19న 102 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం.
దేశంలో 18వ లోక్సభకు ఏప్రిల్ 19 నుంచి ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ ఒకటిన ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఆదివారం ఉదయం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎన్నికల సంఘం ప్రతిపాదనను రాష్ట్రపతికి పంపింది. ప్రక్రియ కింద, ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా ఎన్నికల తేదీలకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర న్యాయ మంత్రికి పంపుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని ఆర్టికల్ 14(2) ప్రకారం.. ఎన్నికల సంఘం ముందుగా ప్రతిపాదనను న్యాయ మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది.
మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను సిద్ధం చేసి కేంద్ర మంత్రివర్గానికి సమర్పిస్తుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రతిపాదనలు రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం దశల వారీగా ఎన్నికల తేదీల నోటిఫికేషన్ జారీ కానున్నది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడుతల్లో ఓటింగ్ నిర్వహించి, జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఈసీ తెలిపింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయని.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని వివరించారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 19న, ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని.. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు మే 13, మే 20, మే 25, జూన్ ఒకటో తేదీల్లో నాలుగు దశల్లో జరుగనున్నట్లు వివరించింది.