BSP | వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా దాదాపుగా ముగిసిందని బహుజన్ సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి మిశ్రా ప్రకటించారు. మొత్తం 403 స్థానాలకు గాను 300 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశామని ఆయన వెల్లడించారు. ఇందులో 90 మంది దళితులున్నారని పేర్కొన్నారు. అటు అధికార బీజేపీ, ఇటు ప్రతిపక్ష సమాజ్వాదీ ఇప్పటికీ తమ అభ్యర్థులను ఫైనల్ చేయలేదని, వారి గెలుపుపై వారికి ధీమా లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 300 మంది అభ్యర్థులను ఫైనల్ చేశామని, మిగతా వారిని కూడా త్వరలోనే ఫైనల్ చేస్తామన్నారు. అయితే బ్రాహ్మణులు, ముస్లింల పరిస్థితి ఏంటని అడగ్గా.. జనవరి 15న అధ్యక్షురాలు మాయావతి పుట్టిన రోజు ఉందని, అప్పుడు ఏంటనేది పూర్తిగా తెలిసిపోతుందని అన్నారు.
పోటీకి దూరంగా మాయావతి
ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత్రి మాయావతి పోటీ చేయడం లేదని బీఎస్పీ ప్రధాన కార్యదర్శి మిశ్రా ప్రకటించారు. తాను కూడా బరిలోకి దిగడం లేదని స్పష్టం చేశారు. మాయావతి బరిలో లేకపోయినా, గెలిచేది మాత్రం బీఎస్పీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన తెలిపారు. బయటికి కనిపించక పోయినా, అభ్యర్థులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే వున్నారని మిశ్రా తెలిపారు.